- మే 3న రంజాన్ పండుగ
- శుభాకాంక్షల ప్రకటన విడుదల చేసిన పవన్
- రంజాన్ ప్రాశస్త్యం వివరించిన జనసేనాని
- ప్రవక్త బోధనలు సర్వదా అనుసరణీయమని వెల్లడి
రేపు (మే 3) రంజాన్ పర్వదినం పురస్కరించుకుని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అంతా దైవచింతనతో ఉపవాస దీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులకు తన తరఫున, జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Related Posts
మానవాళికి సచ్ఛీలత, సన్మార్గం, క్షమ, దయాగుణాలను బోధించే దివ్య ఖురాన్ దివి నుంచి భువికి వచ్చిన పుణ్యకాలం రంజాన్ అని విశ్వసిస్తారని పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికతల సారం ఈ వేడుక అని తెలిపారు. మానవాళిలో దానగుణం ఉండాలని రంజాన్ తెలియచెబుతోందని పవన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ దానం చేయాలన్న ప్రవక్త బోధన ఎంతో విలువైనదని ఉద్ఘాటించారు.
ధనిక, పేద అనే తారతమ్యాలను మరచి మానవత్వంతో మెలగాలని… చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు మాట్లాడరాదు అనే హితవచనాలు సర్వదా అనుసరణీయమని వివరించారు.