హైదరాబాద్, ఏప్రిల్ 15:తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని పోలీసు నియామక మండలి ఏప్రిల్ 15న విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్సైట్లో ఆన్సర్ కీలను చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ప్రకటలో తెలిపారు. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
అభ్యంతరాలకు అవకాశం..
ప్రిలిమినరీ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల నుంచి 17 వరకు వెబ్సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్సైట్లో సమర్పించాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లో అభ్యంతరాలు స్వీకరించరు. అభ్యంతరాల నమోదుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ వివరాలు నమోదుచేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
